Jayaprada | ప్రముఖ సినీ నటి, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద పరారీలో ఉన్నట్లు మంగళవారం కోర్టు ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై రాంపూర్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను రాంపూర్లోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు లో విచారిస్తున్నది.
ప్రాసిక్యూషన్ తరుపు న్యాయవాది అమర్నాథ్ తివారీ వాదిస్తూ కోర్టు చాలాసార్లు జయప్రదకు సమన్లు, వారెంట్లు జారీ చేసిందన్నారు. ఎన్నో వాయిదాలకు నటి జయప్రద హాజరుకాలేదని చెప్పారు. దాంతో న్యాయస్థానం ఆమెపై వారెంట్ జారీ చేసింది. ఆపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇంత జరిగినా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. మాజీ ఎంపీ జయప్రదపై కోర్టు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అంతే కాకుండా పోలీసు సూపరింటెండెంట్కు చాలాసార్లు లేఖ రాశారు. నటి జయప్రదను హాజరుపరచమని ఆదేశాలిచ్చినా ఆమె ఇప్పటికీ కోర్టుకు హాజరు కాలేదు.
జయప్రద వైఖరిపై మంగళవారం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన వైఖరి ప్రదర్శిస్తూ, మాజీ ఎంపీ, నటి జయప్రద పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. అలాగే, ఆమెపై సీఆర్పీసీ 82 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటూ, ఒక డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, జయప్రదను వచ్చేనెల ఆరో తేదీన కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ ని ఆదేశించింది. జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిందంటూ కమ్రీ పోలీస్ స్టేషన్ ,స్వర్ పోలీస్ స్టేషన్లలో 2019లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.