భోపాల్ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు మాస్క్ ధరించడంతో పాటు నిబంధనలు పాటించాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు అధికారులు సైతం జనానికి మాస్క్ల వాడకం, కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరుణంలో పలువురికి ఆదర్శంగా నిలువాల్సిన ఓ మాజీ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
మాస్క్ పెట్టుకోవాలని చేతికి అందజేయగా.. నిర్లక్ష్యంగా కారులో నుంచే దాన్ని బయటకు పడేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కరోనా కట్టడిలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్తలు కొందరు దాటియాలోని బామ్ బామ్ మహదేవ్ చౌక్ దగ్గర.. మాస్క్లు ధరించని వారికి ఉచితంగా పంపిణీ చేపట్టారు. అదే సమయంలో మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు ఇమర్తిదేవి అక్కడకు కారులో వచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త మాజీ మంత్రికి మాస్క్ అందజేశాడు. దాన్ని తీసుకున్న ఆమె.. కారు కొంత ముందుకు వెళ్లిన తర్వాత మాస్క్ను బయటపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాజీ మంత్రి తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇమర్తిదేవి వివాదాస్పదంగా వ్యవహరించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఆమె కరోనా బారినపడ్డట్లు వార్తలు రాగా.. ‘నేను మట్టి, పేడలో పుట్టాను. కరోనా నా దరిదాపుల్లోకి కూడా రాదు’ అంటూ వార్తల్లో నిలిచారు.