నాగపూర్, మార్చి 7: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా గురువారం నాగ్పూర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. మంగళవారం బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచి ఇచ్చిన తీర్పు మేరకు జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా, 90 శాతం వైకల్యంతో వీల్చైర్కే పరిమితమైన సాయిబాబా మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయిల్ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్పూర్ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలయ్యారు.
దేశంలోని మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల కోసం పోరాడినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని సాయిబాబా ఆరోపించారు. తనకు ఆరోగ్యం బాగా లేదని, మాట్లాడలేనని తొలుత పేర్కొన్నప్పటికీ న్యాయవాదులు, మీడియా వారి వినతి మేరకు మాట్లాడారు. కఠినమైన జైలు జీవితం గడిపిన తర్వాత తానిలా బయటపడటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తనపై అక్రమ కేసు బనాయించారన్నారు. తాను, తన మిత్రులు అనుభవించిన 10 ఏండ్ల జైలు జీవితాన్ని ఎవరు వెనక్కి తెస్తారని ఆయన ప్రశ్నించారు.