న్యూఢిల్లీ: వీవీఐపీల హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో మాజీ రక్షణ కార్యదర్శి శశికాంత్ శర్మకు బెయిల్ లభించింది. రూ.2 లక్షల బాండ్, అంతే మొత్తానికి ఒకరి షూరిటీ కింద సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కాగా, రూ.3600 కోట్ల ఈ కుంభకోణంలో శశికాంత్ శర్మ బెయిల్ కోసం ఆయన తరుఫున న్యాయవాదులు ఆర్కే హాండూ, ఆదిత్య చౌదరి కోర్టులో వాదించారు. మాజీ రక్షణ కార్యదర్శిగా, కాగ్గా పలు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఆయన పని చేసి రిటైర్ అయ్యారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఆయనను తప్పుగా ఇరికించారని, చార్జిషీట్లో పేర్కొన్న నేరారోపణలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సీబీఐ విచారణకు హాజరుకావడంతోపాటు దర్యాప్తునకు సహకరించారని గుర్తు చేశారు. 69 ఏండ్ల వయసున్న శశికాంత్ శర్మ వయసు రిత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆయనకు ఒకసారి గుండెపోటు రావడంతో స్టెంట్ వేశారని, గుండెకు సంబంధించిన చికిత్స పొందుతున్నారని చెప్పారు.
కాగా, సమన్లు జారీ చేయడంతో శశికాంత్ శర్మను గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయన బెయిల్కు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో శశికాంత్ శర్మకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు చార్జిషీట్లో పేర్కొన్న నిందితులంతా ఈ నెల 28న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.