ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుటుంబాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన తల్లితో పాటు భార్య, కుమార్తెను కలిసి ఓదార్చారు. పత్రాచాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరు గంటలకుపైగా విచారించిన అనంతరం ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాను నిర్ధోషినని, తనను కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఈడీ అధికారులు సంజయ్ రౌత్ను పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచి, ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలించారు.
రౌత్ అరెస్టుపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ద్రోహాన్ని మహారాష్ట్ర ఎన్నటికీ సహించదని, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం పతనం తప్పదని అన్నారు. కొంకణ్ ప్రాంతంలో తన పర్యటన సందర్భంగా శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ షిండే ప్రభుత్వం దృష్టి ‘చెత్త రాజకీయాల’పైనే ఉందని, ప్రజా సంక్షేమంపై కాదని విమర్శించారు. ఈ మొత్తం రాజకీయ నాటకం ఒకటిన్నర నెలలని, మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవడం ఖాయమన్నారు.