బిహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ… వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పూజారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వీడయో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో పేద ప్రజల్లో ధర్మంపై విపరీతమైన శ్రద్ధ పెరిగిందని, గతంలో వారెవ్వరూ సత్యనారాయణ కథ చేయించేవారు కాదని పేర్కొన్నారు. అసలు వారికి సత్యనారాయణ కథే తెలియదని అన్నారు. ఇప్పుడు మాత్రం ప్రతి గల్లీలో సత్యనారాయణ కథలు నడుస్తున్నాయి. పూజారులు వారి దగ్గరికి వెళ్లీ.. ఏమి తినరని, కేవలం నగదు మాత్రమే అడుగుతారని మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మాంఝీపై ఒక్కొక్కరుగా విరుచుకుపడ్డారు. దీంతో ఆయన పార్టీ నేత దానిశ్ రిజ్వాన్ స్పందించారు. ఆయన మాటలను కొందరు వక్రీకరించారని పేర్కొన్నారు.
స్పందించిన జితిన్ రాం మాంఝీ
ఆయన చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేగుతుండటంతో మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ స్పందించారు. తాను పూజారులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తన వ్యాఖ్యలతో ఎవరైనా ఇబ్బందిపడితే, వారిని క్షమించమని కోరుతున్నానని పేర్కొన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు తమ సామాజిక వర్గానికి ఉద్దేశించిన వ్యాఖ్యలని తెలిపారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారు పూజారులతో పూజలు చేయించుకుంటున్నా, వారి దగ్గర మాత్రం తినడం లేదని మాంఝీ పేర్కొన్నారు.