అగర్తలా: మాజీ సీఎం బిప్లబ్ దేబ్ త్రిపురలో సమాంతర పరిపాలన సాగిస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత సుదీప్ రాయ్ బర్మన్ ఆరోపించారు. మానిక్ షా సీఎం పదవిలో ఉండటం బిప్లవ్ దేవ్కు ఇష్టం లేనట్లుగా కనిపిస్తున్నదని విమర్శించారు. అందుకే ఆయన రాష్ట్రంలో సమాంతర పాలన నడుపుతున్నారని ఆరోపించారు. భారీ భద్రత మధ్య ఆయన సీఎం నివాసంలో ఎలా ఉంటున్నారు? ఇప్పుడు కూడా హెలికాప్టర్లను ఎలా ఉపయోగిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఇది తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని అన్నారు. త్రిపుర బీజేపీలోని అంతర్గత విభేదాలకు ఇది నిదర్శనమని విమర్శించారు.
కొత్త సీఎం మానిక్ షా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాజీ సీఎంకు అదనపు భద్రతను ఉపసంహరించినప్పటి నుంచి బిప్లవ్ దేవ్ కోసం చేసిన ఖర్చులను లెక్కగట్టి రికవరీ చేయాలని ప్రధాన కార్యదర్శి, డీజీపీని తాను కోరుతున్నానని సుదీప్ రాయ్ బర్మన్ డిమాండ్ చేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులకు సమాధానం చెప్పకుండా రాష్ట్రం విడిచి వెళ్లేందుకు త్రిపుర ప్రజలు అనుమతించరని మండిపడ్డారు.
కాగా, సుదీప్ రాయ్ బర్మాన్ 2018లో బిప్లబ్ దేబ్ క్యాబినెట్లో ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. అయితే వారిద్దరి మధ్య విభేదాల కారణంగా ఆ పదవి నుంచి ఆయనను తొలగించారు. దీంతో రాయ్ బర్మన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే 2016లో కాంగ్రెస్ను వీడిన ఆయన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చేరారు. 2017లో టీఎంసీని వీడి బీజేపీలో చేరారు.