పట్నా : తమను పాకిస్తాన్ వెళ్లాలని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బరి సిద్ధిఖి మండిపడ్డారు. ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదని దీటుగా బదులిచ్చారు. విదేశాల్లోనే ఉద్యోగాలు చూసుకోవాలని, వీలైతే అక్కడే పౌరసత్వం తీసుకోవాలని తన కొడుకు, కూతురికి చెప్పానని సిద్ధిఖి పేర్కొనడంతో ఈ వివాదం మొదలైంది.
బిహార్లో గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్జేడీ నేత సిద్ధిఖి మాట్లాడుతూ తన కుమారుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టా పొందిందని, వారు విదేశాల్లోనే పనిచేయాలని, వీలైతే ఆయా దేశ పౌరసత్వం తీసుకోవాలని కోరానని చెప్పుకొచ్చారు. భారత్లో వాతావరణం వారు భరించగలరో లేదో తనకు తెలియదని కూడా వారికి చెప్పానని అన్నారు. సిద్ధిఖి వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తూ ఆయనను జాతి వ్యతిరేకిగా అభివర్ణించారు.
దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన సిద్ధిఖి తన జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ కోరారు. దేశంలో ఉండటం సిద్ధిఖికి అసౌకర్యంగా, కష్టంగా ఉంటే రాజకీయ నేతగా ఆయన అనుభవించే సౌకర్యాలను వదిలి కుటుంబంతో సహా పాకిస్తాన్కు వెళ్లాలని సూచించారు. ఆనంద్ వ్యాఖ్యలను ఆర్జేడీ నేత సిద్ధిఖి తోసిపుచ్చారు. దేశంలో ప్రస్తుతం విద్వేష రాజకీయాలు నడుస్తున్నాయని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి మూలాల గురించి అప్పట్లో ఎవరికీ తెలియదని, కానీ ఇప్పుడు కాషాయ నేతలు దేశద్రోహులు, దేశభక్తులంటూ అందరికీ నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని సిద్ధిఖి ఆందోళన వ్యక్తం చేశారు.