న్యూఢిల్లీ : సూర్యుడి కదలికలను పరిశీలించేందుకు కుతుబ్ మినార్ను ఐదో శతాబ్ధంలో రాజా విక్రమార్క నిర్మించాడని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరంవీర్ శర్మ పేర్కొన్నారు. సూర్యుడు ఏ దిశలో పయనిస్తున్నాడనేది అధ్యయనం చేసేందుకు కుతుబ్ మినార్ను రాజా విక్రమార్క నిర్మించాడని, దీన్ని కుతుబ్ అల్ దిన్ అలిబక్ నిర్మించలేదని శర్మ స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి తన వద్ద పలు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఏఎస్ఐ తరపున తాను పలుమార్లు కుతుబ్ మినార్ను సర్వే చేశానని ఆయన చెప్పుకొచ్చారు. కుతుబ్ మినార్ టవర్లో 25 అంగుళాల వంపు ఉందని, ఇది సూర్యుడిని గమనించడానికి ఏర్పాటు చేశారని అన్నారు.
అందుకే జూన్ 21 న సూర్యాస్తమయం సమయంలో కనీసం అరగంట పాటు నీడ ఆ ప్రాంతంపై పడదని ఇది సైన్స్, పురావస్తు వాస్తవం అని వివరించారు. కుతుబ్ మినార్ స్వతంత్ర కట్టడమని, సమీపంలోని మసీదుతో దీనికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కుతుబ్ మినార్ తలుపు ఉత్తర భాగాన ఉందని, రాత్రి వేళ ఆకాశంలో ధ్రువనక్షత్రాన్ని వీక్షించేలా ఈ ఏర్పాటు చేశారని ధరంవీర్ శర్మ తెలిపారు.