న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించకపోవడంతో ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబుల్ హసన్ ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న హైటెన్షన్ వైర్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. పార్టీ తప్పుడు విధానాలను నిరసిస్తూ టవర్పైకి ఎక్కి ఆత్మాహుతికి పాల్పడతానని అతడు బెదిరింపులకు దిగాడు.
ఎంసీడీ ఎన్నికల్లో పోటీ చేసే 134 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ఆప్ విడుదల చేసింది. 134 మంది అభ్యర్ధుల్లో 70 మంది మహిళలున్నారు. ఇక డిసెంబర్ 4న జరిగే ఎంసీడీ ఎన్నికలకు 117 మంది అభ్యర్ధులతో ఆప్ మలి జాబితాను తాజాగా విడుదల చేసింది. కాంగ్రెస్ను వీడి ఆప్లో చేరిన సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్ను ఆదర్శ్ నగర్ వార్డ్ నుంచి బరిలో నిలిపింది. మాజీ ఎమ్మెల్యే విజయేందర్ గార్గ్ ఆప్ అభ్యర్ధిగా నరైనా నుంచి ఎంసీడీ ఎన్నికల బరిలో నిలిచారు.