న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కల్పించిన 10 శాతం కోటా.. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ఎటువంటి ప్రభావం పడకుండా మొదటిసారిగా 50 శాతం జనరల్ క్యాటగిరీ సీట్ల నుంచి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% కోటా కల్పించామని పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన 103వ రాజ్యాంగ సవరణను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గట్టిగా సమర్థించారు. ఇది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఎస్ఈబీసీ) కోసం ఉద్దేశించిన 50 శాతం కోటాకు ఇది భంగం కలిగించలేదని వివరించారు. అయితే ఈడబ్ల్యూఎస్ కోటాను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. వర్గీకరణకు ఆర్థిక అంశం ప్రాతిపదిక కాదని, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించాలంటే సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని తీర్పును పునఃసమీక్షించాల్సి ఉంటుందని పేర్కొన్నది. విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.