న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఎక్కడి నుంచైనా సొంత నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు ఓటు వేసేలా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్వీఎం) నమూనాను రూపొందించింది. జనవరి 16న ఈ నమూనాను రాజకీయ పార్టీలకు ప్రదర్శించనున్నది. ఇందుకు హాజరుకావాల్సిందిగా 8 జాతీయ, 57 ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆహ్వానం పంపింది. దీని వినియోగంలో ఎదురయ్యే న్యాయ, నిర్వాహక, సాంకేతిక సవాళ్లు, సమస్యలపై తమ అభిప్రాయాలను జనవరి 31లోపు తెలియజేయాలని పార్టీలను ఈసీ కోరింది. ఈ బహుళ నియోజకవర్గాల రిమోట్ ఓటింగ్ మిషన్ ద్వారా ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల ఓటర్లు వారి సొంత నియోజకవర్గాల్లో ఓట్లు వేయవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
వలస ఓటర్లకు ఉపయోగకరం
2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతమే పోలింగ్ నమోదైంది. దాదాపు 30 కోట్ల మంది ఓటేయలేదు. ఇందుకు ప్రధాన కారణం ఉపాధి కోసం దేశంలో ఒక చోట నుంచి మరో చోటకు వలస వెళ్లిన ఓటర్లలో చాలా మంది ఓటేయలేకపోవడమని ఈసీ భావిస్తున్నది. రిమోట్ ఓటింగ్ అమల్లోకి వస్తే వీరు ఓటు వేసేందుకు సొంత నియోజకవర్గాలకు రావాల్సిన అవసరం ఉండదని ఈసీ ప్రకటించింది. ‘ఏదైనా ఒక చోటకు వలస వెళ్లిన వారు చాలా వరకు ఆ ప్రాంతంలో ఓటరుగా నమోదు కావడం లేదు. తరచూ ఒక చోట నుంచి మరో చోటకు మారాల్సి రావడం, వెళ్లిన ప్రాంతం గురించి పూర్తి అవగాహన లేకపోవడం, స్వస్థలాల్లో ఓటు తొలగించుకునేందుకు ఇష్టం లేకపోవడం వంటివి ఇందుకు కారణాలు. రిమోట్ ఓటింగ్ మిషన్లు విజయవంతంగా అమలులోకి వస్తే వీరు ఉన్న చోట నుంచే స్వంత నియోజకవర్గాలకు ఓట్లు వేసే అవకాశం కలుగుతుంది.’ అని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది.
వ్యతిరేకించిన కాంగ్రెస్
రిమోట్ ఓటింగ్ వ్యవస్థను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఎన్నికల వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఇది దెబ్బతీస్తుందని ఆ పార్టీ నేత జైరాం ఆరోపించారు. ముందుగా ఈవీఎంల దుర్వినియోగం మీద ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని కల్పించాలని ఈసీని కోరారు.
చట్ట సవరణ అవసరం
రిమోట్ ఓటింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం అంత సులువు కాదు. ఇందుకు ప్రజాప్రాతినిథ్య చట్టం-1950, 1951, ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961, ఓటర్ల నమోదు నిబంధనలు-1960 చట్టాల్లో మార్పు చేయాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. రిమోట్ ఓటింగ్లో గోపత్య, ఓటర్ల గుర్తింపు, పోలింగ్ ఏజెంట్ల లభ్యత, కౌంటింగ్ వంటి సవాళ్లు ఎదురుకానున్నాయి.