బెంగళూరు: భగవద్గీతే కాదు ప్రతి మత గ్రంథం ధర్మాన్ని బోధిస్తుందని కర్ణాటక కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కే రెహ్మాన్ ఖాన్ అన్నారు. ధర్మం, భారతీయ సంస్కృతిని బోధించేది భగవద్గీత మాత్రమే అని బీజేపీ చెప్పడం సరికాదన్నారు. అన్ని మతపరమైన పుస్తకాలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఈ అంశంలో బీజేపీకి స్వార్థం ఉందని ఆయన విమర్శించారు. హిందుత్వ విధానాన్ని సిలబస్లో తీసుకురావడమే కేంద్రం కొత్త విద్యా విధానం తప్ప మరేమీ కాదని ఆరోపించారు.
కాగా, గుజరాత్ తరహాలో భగవద్గీతను స్కూల్ సిలబస్లో ప్రవేశపెట్టబోతున్నట్లు కర్ణాటక విద్యా మంత్రి నగేశ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కే రెహ్మాన్ ఖాన్ స్పందించారు. వారు మతపరమైన పుస్తకాన్ని సూచిస్తే తప్పు లేదన్నారు. అయితే భారత్ అనేక మతాలు కలిగిన భిన్నత్వ దేశమని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా ఈ అంశంపై శనివారం స్పందించారు. నైతిక విద్యకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పారు. వారు (బీజేపీ) భగవద్గీత, ఖురాన్ లేదా బైబిల్ బోధించినా తమకు అభ్యంతరం లేదన్నారు. భగవద్గీత బోధనపై కర్ణాటక ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే రాజ్యాంగం, సెక్యులరిజంపై తమకు నమ్మకం ఉందన్నారు.
కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు భగవద్గీతను స్కూల్ సిలబస్లో ప్రవేశపెడుతున్నాయి. తొలుత గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోగా తాజాగా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దీనిపై సమాలోచన చేస్తున్నది. నిఫుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక విద్యా శాఖ మంత్రి నగేశ్ శుక్రవారం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీతను స్కూల్ సిలబస్లో ప్రవేశపెడతామని చెప్పారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందిస్తున్నారు.