ముంబై: మహారాష్ట్రలో శివసేన మనుగడ కోసం ‘అసహజ’ కూటమి నుంచి తప్పనిసరిగా తప్పుకోవాలని ఆ పార్టీ రెబల్ నేత ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫేస్బుక్ లైవ్లో ఉద్వేగ ప్రసంగం అనంతరం షిండే ఈ మేరకు ట్వీట్ చేశారు. గత రెండున్నర ఏళ్లలో శివసేన మాత్రమే నష్టపోయిందని, కూటమిలోని ఇతర పార్టీలు (ఎన్సీపీ, కాంగ్రెస్) లాభపడ్డాయని విమర్శించారు. ఇతర పార్టీలు బలపడిన చోట శివసేన బలహీనపడిందన్నారు. ‘పార్టీని, శివ సైనికులను కాపాడటానికి, అసహజ కూటమిని రద్దు చేయడం చాలా ముఖ్యం. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మహారాష్ట్ర కోసమేనని అని అన్నారు. శివసేన బీజేపీతో పొత్తును పునరుద్ధరించి రాష్ట్రాన్ని పాలించాలని ఏక్నాథ్ షిండే కోరుతున్నారు.
మరోవైపు తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. తనపై నమ్మకం లేదని ముఖాముఖిగా ఒక్క రెబల్ ఎమ్మెల్యే చెప్పినా వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన ఉద్ధవ్ చివరి నిమిషంలో దానిని రద్దు చేశారు. కరోనా సోకిన ఆయన ఫేస్బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. శివసేన ఎప్పుడూ కూడా హిందుత్వాన్ని వీడలేదన్నారు. తన తండ్రి బాలసాహెబ్ ఠాక్రే ఇదే తమకు నేర్చించారని చెప్పారు.
తనపై నమ్మకం లేదని కాంగ్రెస్ లేదా ఎన్సీపీ చెప్పలేదని, సొంత పార్టీ నేతలు ఈ మాట అనడం తనకు బాధగా ఉందని ఉద్ధవ్ ఆవేదన చెందారు. ‘నేను సీఎంగా వద్దని నా ప్రజలు అనుకుంటే, లేదా ఎవరైనా ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రిగా వద్దని చెబితే. వెంటనే రాజీనామా చేస్తా. సీఎం అధికార నివాసం వర్షాను వీడి మాతోశ్రీకి వెళ్తా’ అని అన్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు తన ముందుకు వచ్చి ముఖాముఖిగా ఈ విషయం చెప్పాలన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోవడం తనకు సిగ్గుగా ఉందన్నారు.