బాలాసోర్, ఏప్రిల్ 14: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆల్ ఒడిశా ఈపీఎఫ్ పెన్షనర్ల అసోసియేషన్ తమ సభ్యులు, వారి కుటుంబాలకు పిలుపునిచ్చింది. కనీస పింఛనుకు సంబంధించి కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే పార్టీలకు వ్యతిరేకంగా ఓటేయాలని బాలాసోర్లో జరిగిన ఈపీఎఫ్ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
వివిధ కార్పొరేషన్లు, ప్రైవేటు సంస్థల నుంచి రిటైర్డ్ అయిన వారిలో చాలా మంది చాలా తక్కువ పింఛను పొందుతున్నారని, నెలకు రూ.వెయ్యి కంటే తక్కువ పింఛనుగా వస్తున్నదని అసోసియేషన్ పేర్కొన్నది. ఈపీఎఫ్ లబ్ధిదారులుగా ఉన్నవాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలు వర్తించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా లేవనెత్తింది. నెలకు కనీస పింఛను రూ.9 వేలతోపాటుగా డీఏ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పార్లమెంటరీ కమిటీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించింది.