జైపూర్: స్మార్ట్ ఫోన్ తమ వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు దారిలో నడిపించడమే కాక, సామాజిక జీవనాన్ని కూడా దెబ్బతీస్తున్నదని, గ్రహించిన రాజస్థాన్లోని ఒక గ్రామానికి చెందిన పౌరులు స్మార్ట్ ఫోన్ వద్దు.. బేసిక్ ఫోనే ముద్దు అంటున్నారు. జన్మలో స్మార్ట్ ఫోన్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుని గ్రామస్తులంతా తమ ఫోన్లను రోడ్డుపై కుప్పగా పోసి రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
స్మార్ట్ ఫోన్ వ్యసనం.. డ్రగ్ వ్యసనం కన్నా తక్కువేమీ కాదని ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడు తెలిపాడు. స్మార్ఫోన్ల వాడకం గ్రామంలో జాఢ్యంలా మారిందని, ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకే పరిమితమై ఒకరినొకరు పలకరించుకోవడం కూడా మానేశారని గ్రామ పెద్ద తెలిపారు. పిల్లలు కూడా నిత్యం ఫోన్లతోనే ఉంటున్నారన్నారు. ఇక నుంచి పాత ఫోన్లనే వాడుతామన్నారు.