లక్నో: ‘చెప్పింది చాలు నోరు ముయ్యి…’ అంటూ చనిపోయిన బాలుడి తల్లిపై ప్రభుత్వ అధికారిణి విరుచుకుపడింది. అంతా విస్తూ పోయే ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. మోదీనగర్కు చెందిన నాలుగో తరగతి విద్యార్థి అనురాగ్ భరద్వాజ్, బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్తుండగా వాంతులయ్యాయి. దీంతో బస్సు కిటికీ నుంచి వాంతి చేసుకున్నాడు. బస్సు డ్రైవర్ దీనిని గమనించలేదు. ఈ నేపథ్యంలో ఒక స్తంభానికి విద్యార్థి తల ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి స్కూల్ బస్సు డ్రైవర్, మరో బస్సు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే స్కూల్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కాగా, మరణించిన విద్యార్థి అనురాగ్ తల్లిదండ్రులు గురువారం కొంతమంది పేరెంట్స్, స్థానికులతో కలిసి ఆ స్కూల్ ఎదుట నిరసన తెలిపారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై నినాదాలు చేశారు. ఈ విషయం తెలిసిన మోదీనగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభాంగి శుక్లా అక్కడకు వచ్చారు. కుమారుడి మృతిపై బాధను వ్యక్తం చేస్తున్న తల్లిపై ఆమె మండిపడ్డారు. ‘చెప్పింది చాలు నోరు ముయ్యి’ అని వేలు చూపించి ఆమెపై అరిచారు. ‘నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు’ అని ప్రశ్నించారు. అయితే చనిపోయింది నీ కుమారుడు కాదుగా అని అనురాగ్ తల్లి నేహా ఏడుస్తూ అన్నది. ‘నా కుమారుడు మరణించడాన్ని నేను చాలా అర్థం చేసుకున్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి ఈ విషయం వెళ్లింది. దీంతో బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై నివేదిక కోరారు. ఆ స్కూల్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఆ స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని తెలియడంతో అన్ని స్కూల్ బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.