ఇండోర్ : అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో విని నేర్చుకున్నాడని మహాభారతంలో ఉంది. ఇదే నమ్మకాన్ని తమ ప్రభుత్వ విధానంగా ఆచరణలో పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా గర్భంలోని శిశువులకు జ్ఞానబోధ చేసేందుకు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ‘గర్భ్ సంస్కార్’ గదులు ఏర్పాటు చేయనున్నది. తల్లిదండ్రులు కాబోయే దంపతులకు ఈ గదుల్లో ప్రసవపూర్వ సంరక్షణ పేరిట భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను బోధించనున్నారు.
సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం, జీవన విధానం, భోజనం చేయడంలో క్రమశిక్షణ, భావోద్వేగపరమైన అంశాలను వారికి నేర్పించనున్నారు. ‘గర్భంలో ఉండగానే శిశువును సంస్కరించడం’ పేరిట ఈ విధానానికి శ్రీకారం చుట్టనున్నట్టు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక కార్యక్రమంలో వెల్లడించారు. దివ్య సంతాన్ ప్రకల్ప్ (దైవిక బాలల ప్రాజెక్ట్) కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ..‘గర్భ్ సంస్కార్’ దీర్ఘకాలిక పెట్టుబడి అని పేర్కొన్నారు. ఇది భవిష్యత్తు తరాలను భౌతికంగా, మానసికంగా, నైతికంగా తీర్చిదిద్దడం అని అభివర్ణించారు.