CHANDRAYAN3| న్యూఢిల్లీ: ఇంతకుముందెన్నడూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 14న చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించింది. బాహుబలి రాకెట్ ఎల్ఎంవీ3-04.. చంద్రయాన్ 3 వ్యోమనౌకను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టి యావత్ భారతావనిని పులకింపజేసింది. అయితే ఈ మిషన్ సక్సెస్ కావడంలో కీలకపాత్ర పోషించిన ఇంజినీర్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏడాదిగాపైగా జీతాలివ్వడం లేదు. చంద్రయాన్-3 లాంచ్ప్యాండ్ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) ఇంజినీర్లకు గత 17 నెలలుగా జీతాలివ్వడం లేదని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ తాజాగా వెల్లడించింది. వేతనాల చెల్లింపు సమస్య ఉన్నప్పటికీ, మొబైల్ లాంచ్ప్యాడ్తోపాటు ఇతర కీలకమైన, సంక్లిష్టమైన ఎక్విప్మెంట్ను హెచ్ఈసీ షెడ్యూల్ కంటే ముందుగానే డెలివరీ చేసింది.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థే హెచ్ఈసీ. రాంచీలో దీని కార్యాలయం ఉన్నది. కంపెనీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడంపై పలు మీడియా సంస్థలు ఏడాది కాలంగా వార్తాకథనాలు వెలువరిస్తూనే ఉన్నాయి. 2700 మంది వర్క్మెన్కు, 450 మంది ఎగ్జిక్యూటివ్లకు గత 14 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఫ్రంట్లైన్ సంస్థ గత మేలో ప్రచురించింది. కంపెనీలో ఆఫీసర్లకు ఏడాదికిపైగా, ఇతర ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలివ్వడం లేదని గత ఏడాది నవంబర్లో ఐఏఎన్ఎస్ రిపోర్ట్ చేసింది. ఇస్రో, రక్షణశాఖ, రైల్వే, కోల్ ఇండియా నుంచి సుమారు రూ. 1500 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినప్పటికీ.. నిధుల కొరత కారణంగా 80 శాతం పనులు పెండింగ్లోనే ఉన్నాయని తన కథనంలో పేర్కొన్నది. రూ.1000 కోట్ల నిధులు అందించాలని హెచ్ఈసీ అనేక సార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంతేగాకుండా, గత రెండున్నరేండ్లుగా హెచ్ఈసీలో కీలకమైన సీఎండీ పదవికి శాశ్వత నియామకం చేపట్టకపోవడం కేంద్ర నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నది.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో.. హెచ్ఈసీ ఉద్యోగులు మరోసారి గర్వంతో తల ఎత్తుకున్నారు. దేశానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులో భాగం కావడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉన్నది.
-సుభాష్ చంద్ర, హెచ్ఈసీ ఇంజినీర్