Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం మరోసారి సమన్లు పంపింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు ఈ నెల 29న లేదంటే 31న సమయంలో ఇవ్వాలని సమన్లలో కోరింది. లేకపోతే ఏజెన్సీ వెళ్లి విచారించనున్నట్లు ఈడీ స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు జారీ చేయడం ఇది తొమ్మిదోసారి. ఎనిమిది సమన్లలో జనవరి 6 నుంచి 20 వరకు విచారణకు రావాలని ఈడీ కోరగా.. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు హేమత్ సోరెన్ పిటిషన్ను తిరస్కరించింది. తొమ్మిదవసారి జారీ చేసిన సమన్లలో జనవరి 27 నుంచి 31 వరకు ఈడీ ముందు హాజరుకావాలని కోరింది. ఇదిలా ఉండగా.. అంతకు ముందు ఈడీ సోరెన్ను ఆయన నివాసంలో సుమారు ఏడుగంటల పాటు విచారించింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని బజ్రాప్రాంతంలో 7.16 ఎకరాల భూమికి సంబంధించిన భూ కుంభకోణంలో హేమంత్ సోరెన్ను ఈడీ విచారించనున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మంది అరెస్టయ్యారు. ఇందులో 2011 బ్యాచ్కు చెందిన అధికారులు ఛవీ రంజన్, భాను ప్రసాద్, వ్యాపారవేత్తలు అమిత్ అగర్వాల్, బిష్ణు అగర్వాల్ ఉన్నారు. ముఖ్యమంత్రికి సైతం సమన్లు జారీ చేయగా.. ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో ఈడీ ఆయన ఇంటికి వెళ్లి విచారించింది.