National Conference on Farooq | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడం కొత్తేమీ కాదని నేషనల్ కాన్ఫరెన్స్ పేర్కొంది. సమన్లు జారీ చేసిన ఈడీకి విచారణలో ఆయన సహకరిస్తారని ట్వీట్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 31న విచారణకు హాజరు కావాలని ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు.
దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేయడం కొత్తేమీ కాదు. దేశంలోని విపక్ష నేతలందరికీ ఇది సర్వ సాధారణమైంది. ఈ కేసులో ఫరూఖ్ అబ్దుల్లా తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్నారు. గతంలో మాదిరే దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారు అని తెలిపింది.
జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ)లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు విచారిస్తారు. ఇదే కేసులో పలుమార్లు ఆయనను ఈడీ విచారించింది. 2020లో ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.11.86 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. జేకేసీఎ అధ్యక్షుడిగా వివిధ పదవుల నియామకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది.