Rohit Pawar-ED | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ముని మనుమడు రోహిత్ పవార్ సారధ్యంలోని షుగర్ మిల్లును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంకు (ఎంఎస్సీబీ) కుంభకోణంపై హవాలా లావాదేవీల నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కంపెనీ విలువ రూ.50 కోట్ల పై చిలుకే.
ఔరంగాబాద్ జిల్లాలోని కన్నాడ్ గ్రామంలో కన్నాడ్ సహకారి షక్కర్ కార్ఖానా లిమిటెడ్ భవనం (కన్నాడ్ ఎస్ఎస్కే), యంత్రాలు, 161.30 ఎకరాల భూమిని జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తులు జప్తు చేసినట్లు పేర్కొంది. బారామతి ఆగ్రో లిమిటెడ్ అనుబంధ సంస్థే కన్నాడ్ ఎస్ఎస్కే. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ సొంత కంపెనీ బారామతి ఆగ్రో లిమిటెడ్. మహారాష్ట్రలోని కర్జాత్-జంఖెడ్ స్థానం నుంచి రోహిత్ పవార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత జనవరిలో బారామతి ఆగ్రో, కన్నాడ్ ఎస్ఎస్కే సంస్థల కార్యాలయాల్లో రోహిత్ పవార్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.