భువనేశ్వర్: నదిలో చిక్కుకున్న ఏనుగును కాపాడబోయిన బోటు బోల్తాకొట్టింది. అందులో ఉన్న టీవీ జర్నలిస్ట్ అరిందమ్ దాస్ నదిలో మునిగి మరణించగా మరో ఫొటో జర్నలిస్ట్ ప్రభాత్తోపాటు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఒడిశాలోని కటక్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. ముండలి సమీపంలోని మహానది బ్యారేజ్ వద్ద పెద్ద ఏనుగు చిక్కుకున్నది.
ఒడిశా విపత్తు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF)కు సమాచారం అందంగా ఏనుగును కాపాడేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ODRAF బోటులో సిబ్బందితోపాటు ఒడిశా టీవీకి చెందిన జర్నలిస్ట్ అరిందమ్ దాస్, కెమేరామేన్ ప్రభాత్ ఉన్నారు. నదీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఏనుగును సమీపించే తరుణంలో బోటు తిరగబడింది. దీంతో బోటులోని వారంతా నదిలో పడ్డారు. వారిని కాపాడి కటక్లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి తరలించేలోపు టీవీ జర్నలిస్ట్ అరిందమ్ దాస్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కెమేరామేన్ ప్రభాత్తోపాటు ఒడిశా విపత్తు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ బీ మొహరానా తెలిపారు. మరో ముగ్గురు సిబ్బంది కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
కాగా, నదిలోని నీటిలో చిక్కుకున్న భారీ ఏనుగును క్రేన్ ద్వారా బయటకు తీయడం కష్టమని అటవీశాఖ అధికారులు తెలిపారు. తాళ్ల సహాయంతో ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు చెప్పారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎదురు చూడాలని, అప్పుడే ఏనుగు ఒడ్డుకు చేరే అవకాశమున్నదని వెల్లడించారు.