రాంచీ: ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్ అయ్యారు. జార్ఖండ్లోని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మీడియా కోర్టులను నడిపిస్తోందని ఆరోపించారు. కొన్ని కేసుల్లో అనుభవజ్ఞులైన జడ్జిలు కూడా ఇవ్వలేని తీర్పులను మీడియా ఇస్తోందని ఆయన అన్నారు. అపరిపక్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని రమణ అన్నారు. అతి దూకుడు, బాధ్యతారాహిత్యం వల్ల మన ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకువెళ్తున్నట్లు మీడియాపై చీఫ్ జస్టిస్ సీరియస్ అయ్యారు. ప్రింట్ మీడియా ఇంకా కాస్త జవాబుదారీగా వ్యవహరిస్తోందని, కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం జీరో జవాబుదారీతనంతో ఉందని ఎన్వీ రమణ అన్నారు. ఇటీవల కాలంలో న్యాయమూర్తులపై భౌతికదాడులు పెరుగుతున్నాయని, ఎటువంటి రక్షణ లేకుండానే జడ్జిలు సమాజంలో జీవించాల్సి వస్తోందన్నారు. రాజకీయవేత్తలు, అధికారులు, పోలీసు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులకు రిటైర్మెంట్ తర్వాత కూడా సెక్యూర్టీ కల్పిస్తున్నారని, కానీ జడ్జిలకు ఇదే తరహా రక్షణ లేకుండాపోయిందన్నారు.
నిర్ణయాత్మక కేసుల్లో మీడియా విచారణ సరైంది కాదన్నారు. బేధాభిప్రాయాలను ప్రచారం చేస్తున్న మీడియా.. ప్రజల్లో వైరుధ్యాన్ని పెంచుతోందన్నారు. దీంతో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందన్నారు. ఇది వ్యవస్థను దెబ్బతీస్తోందన్నారు. ఈ క్రమంలో న్యాయవ్యవస్థపై పెను ప్రభావం పడుతోందన్నారు. సోషల్ మీడియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని సీజే అన్నారు. స్వీయ నియంత్రణతో మీడియా ఉండాలని ఆయన కోరారు. పదాలను మీడియా జాగ్రత్తగా వాడాలన్నారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రజలను విద్యావంతులను చేసేందుకు, చైతన్యపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తన గళాన్ని వాడుకోవాలని సీజే రమణ సూచించారు.