న్యూఢిల్లీ: ఒకే బల్బున్న పూరి గుడిసెకు లక్షల్లో కరెంటు బిల్లు.. ఒక్క దోశ తింటే వేలల్లో బిల్లు అనే వార్తలు ఇప్పటివరకు మనం చాలనే విన్నాం.. చదివాం కూడా!. అలాంటి వార్తే మరొకటి.. ఓ రైసు మిల్లుకు కోట్లలో కరెంటు బిల్లు వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు. అక్షరాలా రూ.90 కోట్లు. అదికూడా మూసివేసిన మిల్లుకు. ఆ బిల్లును చూసిన మిల్లు యజమాని షాక్ గురయ్యాడు. అయితే యధావిధిగా సాంకేతిక లోపం వల్ల వచ్చిందని చెప్పడం విద్యుత్ శాఖ వంతయ్యింది. ఇది హర్యానాలోని కలన్వాలీలో జరిగింది.
కలన్వాలీలో ఓ రైసు మిల్లు ఉంది. అది కొద్ది కాలం క్రితమే మూతపడింది. విద్యుత్ అధికారులు ప్రతి నెల కరెంటు బిల్లు ఇస్తున్నారు. అయితే ఈసారి అది రూ.90 కోట్లకు పైగా వచ్చింది. ఆ బిల్లును చూసిన మిల్లు యజమాని అవాక్కయ్యారు. విషయాన్ని ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగ మాకు రూ.5 నుంచి రూ.6 లక్షల బిల్లు వస్తుంది. అయితే ఈ సారిమాత్రం రూ.90.134 కోట్లు వచ్చింది. అదికూడా మూసేసిన మిల్లుకు అని శ్రీ గణేశ్ రైస్ ఇండస్ట్రీస్ యజమాని చెప్పారు.
కాగా, సాంకేతిక లోపంవల్లే బిల్లు ఎక్కువగా వచ్చిందని, కొత్తగా ఉపయోగించిన సాఫ్ట్వేర్లో తేడాల వల్లే ఇంత భారీగా నమోదయ్యిందని సబ్డివిజనల్ ఆఫీసర్ రవి కుమార్ చెప్పారు. అయితే ఈ సమస్య పరిష్కారమయ్యిందని, ఆన్లైన్లో కూడా అప్డేట్ చేశామని వెల్లడించారు.