‘ఛార్జింగ్ పెడుతుండగా పేలిన ఈవీ బ్యాటరీ’‘ఫుల్ ఛార్జింగ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు’ఇటీవలి కాలంలో ఇలాంటి వార్తలు చూసే ఉంటారు.దేశీయ కంపెనీలు తయారుచేసిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) ప్రమాదాలకు గురికావడం ఏంటి? చైనా ఫోన్లు పేలిపోయినట్టు, ఈవీల్లో మంటలు రావడమేంటి?అనుకొంటున్నారా?? ఆ వాహనాల్లో చైనా బ్యాటరీలు వాడారు మరి!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): నాణ్యతలేని బ్యాటరీలు, పరికరాలను వాడటం వల్లే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని గతకొంతకాలంగా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ వాదనలను కొట్టిపారేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా తయారుచేసిన ఈ వాహనాలు నాణ్యమైనవేనని డప్పు కొట్టింది. ఇప్పుడు అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈవీల ప్రోత్సాహకానికి కేంద్రం తీసుకొచ్చిన ‘ఫేమ్2’ స్కీమ్ కాదు.. ఓ స్కామ్ అనే వాదనకు బలం చేకూరుతున్నది. విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్-రెండో దఫా’ (ఫేమ్2) పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో చేరి, ప్రయోజనాలు పొందాలంటే దేశీయంగా తయారుచేసిన పరికరాలతోనే విద్యుత్తు వాహనాలను దేశీయ కంపెనీలు తయారుచేయాల్సి ఉంటుంది.
జరిగిందేంటి?
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిదారు ‘హీరో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘ఒకినావా ఆటోటెక్ ప్రైవెట్ లిమిటెడ్’ వంటి పలు ఈవీ కంపెనీలు విద్యుత్తు వాహనాల్లో వినియోగించే బ్యాటరీలను, ఇతర ముఖ్య పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్నట్టు ఏప్రిల్లో పలు నివేదికలు ఆరోపించాయి. స్వదేశీ పరికరాలనే వాహన తయారీలో వాడాలన్న ‘ఫేమ్2’ పథకం నిబంధనలను సదరు కంపెనీలు ఉల్లంఘించాయని మండిపడ్డాయి. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇలా ఒక్కో మోడల్ వాహనానికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.400 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి దొడ్డిదారిన సబ్సిడీని అందుకొన్నట్టు ధ్వజమెత్తాయి. హీరో ఎలక్ట్రిక్తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా నిబంధనలు ఉల్లంఘించి రూ.కోట్లలో ఆర్థిక లబ్ధి పొందాయని నిపుణులు కూడా మండిపడ్డారు. ఇదే విషయాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత దాసోజు శ్రవణ్ కూడా ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఇంతజరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో కేంద్రంలోని పెద్దల సహకారంతోనే ఈ తతంగం అంతా జరుగవచ్చన్న వాదనలు బలంగా వినిపించాయి. సర్వత్రా విమర్శలు పెరుగుతుండటంతో.. కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. ఫేమ్2 స్కీమ్ను దుర్వినియోగం చేసిన కంపెనీలపై దర్యాప్తు చేపడుతామని తెలిపింది.
ఆరోపణలున్న కంపెనీలు ఇవే
హీరో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రై.లి., ఒకినావా ఆటోటెక్ ప్రై.లి., బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రై.లి., ఒకాయా ఈవీ ప్రై.లి., జితేంద్ర న్యూ ఈవీ టెక్ ప్రై.లి., గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి., రివోల్ట్ ఇంటెల్లికార్ప్ ప్రై.లి., కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లి., ఎవోన్ సైకిల్స్ లి., లోహియా ఆటో ఇండస్ట్రీస్, తుక్రాల్ ఎలక్ట్రిక్ బైక్స్ ప్రై.లి., విక్టరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇంటర్నేషనల్ ప్రై.లి.
‘ఫేమ్2’.. అతిపెద్ద కుంభకోణం
ఫేమ్2 సబ్సిడీ అతిపెద్ద కుంభకోణం. ఇదే విషయాన్ని గత ఏప్రిల్లో నేను బయటపెట్టా. అప్పుడు కేంద్రప్రభుత్వం స్పందించలేదు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్ వల్ల చైనాకు లబ్ధి చేకూరింది. దీనిపై ఈడీ, సీబీఐతో కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయించట్లేదు?
–ట్విట్టర్లో బీఆర్ఎస్ నేతదాసోజు శ్రవణ్
స్కామ్ విలువ 2,160 కోట్లు?