Elections : ఒడిశాలో లోక్సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 21 లోక్సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు మే 13 నుంచి జూన్ 1 వరకు మొత్తం విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల సంగ్రామంలో వేర్వేరు రాజ కుటుంబాలకు చెందిన 12 మంది పోటీ పడుతున్నారు. వీరంతా ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ సామాన్య ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.
ఈ 12 మందిలో అధికార బిజూ జనతాదల్ (BJD) పార్టీ 8 మందిని బరిలో దింపింది. అదేవిధంగా బీజేపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒక్కరు రాజ కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఈ 12 మందిలో 10 మంది అసెంబ్లీ ఎన్నికల బరిలో, ఇద్దరు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. అధికార బీజేడీ ధారాకోట్కు చెందిన ఒకప్పటి నాయకుడు ఏఎన్ సింగ్డియో మనుమరాలు సులక్షణా గీతాంజలి దేవిని సనాఖేముండి అసెంబ్లీ స్థానం నుంచి తన అభ్యర్థిగా బరిలో దింపింది.
లా డిగ్రీ చదివిన గీతాంజలి ధారాకోట్ రాజ కుంటుంబం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఐదో వ్యక్తిగా గుర్తింపు పొందారు. గీతాంజలి తాత సురాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, అస్కా లోక్సభ స్థానం నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు. గీతాంజలి నానమ్మ శాంతి దేవి, తండ్రి కిషోర్చంద్ర సింగ్డియో కూడా ఒక్కోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. సనాఖేముండి నుంచి 2014లో గీతాంజలి తల్లి నందిని దేవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇక చికిటి రాజ కుటుంబానికి చెందిన చిన్మయానంద శ్రీరూప్ దేవ్ను కూడా బీజేడీ చికిటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. చిన్మయానంద తల్లి ఉషా దేవి 2000 సంవత్సరం నుంచి వరుసగా ఐదు పర్యాయాలు చికిటి నుంచి గెలుపొందారు. బీజేడీ సర్కారులో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చిన్మయానంద తాత సచ్చిదానంద దేవ్ కూడా 1971లో ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్మయానంద గత రెండు దశాబ్దాలుగా ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఇప్పుడు ఉద్యోగం మానేసి సొంత వ్యాపారం చేసుకుంటున్నారు.
ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ సంగీతా కుమారి సింగ్ దేవ్ను మరోసారి బొలాంగిర్ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిపింది. ఆమె బొలాంగిర్ రాజకుటుంబానికి చెందినవారు. సంగీత భర్త కేవీ సింగ్ దేవ్ను బీజేపీ పట్నగఢ్ అసెంబ్లీ స్థానం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. సంగీత ఇప్పటికే నాలుగు పర్యాయాలు బొలాంగిర్ లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. కాగా బొలాంగిర్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన కాలియేశ్ నారాయణ్ సింగ్ దేవ్ను బీజేడీ ఈసారి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపింది.
అదేవిధంగా బీజేపీ మాజీ ఎంపీ అర్కా కేశరీ దేవ్ భార్య మాళవిక కేశరీ దేవ్ను కలహండి లోక్సభ స్థానం నుంచి పోటీకి పెట్టింది. కలహండి రాజ కుటుంబానికి చెందిన ఈ భార్యాభర్తలిద్దరూ 2023లో బీజేడీని వీడి బీజేపీలో చేరారు. అర్కా కేశరీ దేవ్ తండ్రి విక్రమ్ కేశరీ దేవ్ కలహండి నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇక బీజేడీ.. డియోగఢ్ రాజు, సంబాల్పూర్ ఎంపీ నితేశ్ గంగదేవ్ సతీమణి రాణి అరుంధతీ దేవిని డియోగఢ్ నుంచి బరిలో నిలిపింది. అదే రాజ కుటుంబానికి చెందిన పుష్పేంద్ర సింగ్ దేవ్ను బీజేడీ ధర్మ్గఢ్ అసెంబ్లీ స్థానంలో పోటీకి పెట్టింది.
ఇక అంగుల్ రాజ కుటుంబానికి చెందిన సంజుక్తా సింగ్ను బీజేడీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపింది. ప్రస్తుతం ఆమె భర్త రజినీకాంత్ సింగ్ అంగుల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా నారాయణ్గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేడీ అవుల్ రాజ కుటుంబానికి చెందిన ప్రత్యూష రాజేశ్వరిని బరిలో నిలిపింది. ఆమె భర్త ప్రతాప్ దేవ్ను అవుల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో పెట్టింది. ఇక దెన్కనాల్ రాజకుటుంబానికి చెందిన సుస్మితా సింగ్ దేవ్ను కాంగ్రెస్ పార్టీ దెన్కనాల్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపింది.