Punjab Dangal | పంజాబ్లో ఐదు నెలల ముందే ఎన్నికల వేడి మొదలైంది. తొలుత ఎస్సీ.. తాజాగా హిందూ సిక్కు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. అందులో భాగంగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని కేదరీనాథ్ ధామ్ను సీఎం చరణ్జిత్ చన్నీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోతి సింగ్ సిద్ధూ కలిసి సందర్శించారు. దానికి ప్రతిగా శిరోమణి అకాలీదళ్ (బాదల్) చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ తన పార్టీ నేతలతో కలిసి రాజస్థాన్లోని సలసార్ధామ్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్లో వివిధ దేవాలయాలకు వెళ్లి దేవుళ్ల ఆశీస్సులు పొందారు.
రాష్ట్రంలో 38.49 శాతం మంది హిందువులు ఉన్నారు. వారి మనస్సులు చూరగొనేందుకే వివిధ పార్టీల నేతలు దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇంతకుముందు అందరి దృష్టి దళిత ఓటుబ్యాంక్పై ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ అకస్మాత్గా సీఎంగా కెప్టెన్ అమరిందర్ సింగ్ స్థానంలో దళిత నేత చరణ్జిత్ సింగ్ చన్నీని నియమించే విషయంలో విఫలమైంది. దీంతో అన్ని పార్టీల దృష్టి హిందువులపైకి మళ్లింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలోని 31.94 శాతం గల దళితుల ఓటుబ్యాంక్పైనే ఆధారపడ్డాయి. దళితుడ్ని సీఎం చేస్తామని బీజేపీ.. మళ్లీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా దళితుడ్ని నియమిస్తామని అకాలీదళ్ హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి దళిత నేతను సీఎంగా నియమించడంతో పరిస్థితి మారిపోయింది. నేతల అంచనాలు, ఆలోచనలూ మారిపోయాయి.
ఇప్పుడు హిందూ ఓటు బ్యాంక్.. కాంగ్రెస్ లేదా బీజేపీ/ కెప్టెన్ అమరిందర్ సింగ్ వైపు మొగ్గుతుందని అంచనాలు ఉన్నాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్.. కేంద్రంలోని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. దీంతో అకాలీదళ్, బీజేపీ మధ్య పొత్తు చెదిరింది. అమరిందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ పరిస్థితుల్లోనే పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా హిందువులను ఆకట్టుకోవాలని నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హిందూనేత సునీల్ జక్కర్ను తొలిసారి సీఎంగా నియమించే అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమీకరణాల నేపథ్యంలో ఆ నిర్ణయం వాయిదా పడింది. ఇప్పటికే కెప్టెన్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. మాజీ సీఎం అమరిందర్ సింగ్ మత సామరస్యం కాపాడేందుకు హామీ ఇస్తున్నారు. దీనికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సిక్కు హిందువుల ఓటు బ్యాంక్ బీజేపీ, కెప్టెన్ సారధ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మధ్య చీలిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.