న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 : ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం మేయర్ ఎన్నిక కోసం సభ జరిగింది. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయవచ్చని ప్రిసైడింగ్ అధికారి, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు సభలో ఆందోళనకు దిగారు. వీరితో బీజేపీ సభ్యులు గొడవకు దిగారు. దీంతో సభ వాయిదా పడింది. జనవరి 6, 24న కూడా మేయర్ ఎన్నిక కోసం సభ జరగగా ఇదే విధంగా వాయిదా పడింది.
డిసెంబర్ 4న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 250 స్థానాలకు గానూ ఆప్ 134 స్థానాలు దక్కించుకొని మ్యాజిక్ ఫిగర్ సాధించింది. అయితే, ఎల్జీ వీకే సక్సేనా 10 మందిని నామినేటెడ్ సభ్యులుగా నియమించారు. బీజేపీకి చెందిన వీరితో నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేయించి మేయర్ పదవిని దక్కించుకోవాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆప్ ఆరోపిస్తున్నది.
కోర్టు పర్యవేక్షణలో ఢిల్లీ మేయర్ ఎన్నిక జరపాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్ నిర్ణయించింది. కాగా, మేయర్ ఎన్నిక జరగకుండా బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు.