Supreme Court : కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకం కోసం ఏర్పాటైన ప్రధాని నేతృత్వంలోని కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించారని, సీజేఐ లేని కమిటీ చేపట్టిన ఈ నియామకాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూలను గురువారం నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమించింది. గతంలో జ్ఞానేశ్ కుమార్ కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా, సంధూ ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రెటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. జ్ఞానేశ్ ఫిబ్రవరిలో, సంధూ జనవరిలో పదవీ విరమణ చేశారు. ఎన్నికల కమిషనర్లు అనూప్చంద్ర పాండే ఈ ఏడాది ఫిబ్రవరి 14న, అరుణ్ గోయెల్ మార్చి 8న తమ పదవులకు రాజీనామా చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘంతో సీఈసీ రాజీవ్కుమార్ ఒక్కరే మిగిలారు.
ఈ నేపథ్యంలో గురువారం సెలక్షన్ కమిటీ సమావేశమై ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులను నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమించింది. శుక్రవారం ఉదయం ఆ అధికారులిద్దరూ నూతన ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ తర్వాత లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ ప్రకటన చేసింది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆ ప్రెస్ మీట్లోనే ఆయా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.