Election Commission | ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, ఓటింగ్ ప్రక్రియను మరింత సౌకర్యంతంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానించనున్నట్లు వెల్లడించింది. మరణాలకు సంబంధించిన డేటాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోనున్నట్లు పేర్కొంది. దాంతో ఓటరు జాబితాను ఖచ్చితత్వంతో అప్డేట్ చేసేందుకు వీలుంటుందని చెప్పింది. నమోదైన మరణాలకు సంబంధించిన సమాచారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ERO) సకాలంలో అందే అవకాశం ఉందని.. చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంతవరకు నిరీక్షించాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన సమాచారంతో వెంటనే బూత్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారాన్ని ధ్రువీకరిస్తారని ఈసీ తెలిపింది.
దాంతో చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి వేగంగా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నికల నిబంధనలు-1960 ప్రకారం.. జనన, మరణాల నమోదు చట్టం-1969 ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ సమాచారం తెలుసుకునేందుకు వీలుందని చెప్పింది. అలాగే, ఓటర్ల సీనియర్, ప్టార్ నంబర్ స్లిప్లో ప్రముఖంగా కనిపించేలా ఓటర్ స్లిప్ని సవరించింది. ఆయా నంబర్ల ఫాంట్ని పెంచనున్నట్లు పేర్కొంది. దాంతో ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను తేలిగ్గా గుర్తించవచ్చని చెప్పింది. పోలింగ్ అధికారులు సైతం జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. అదే సమయంలో బూత్ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఎన్నికల సంబంధిత విధులను నిర్వహిస్తున్న సమయంలో, ఇంటింటికీ వెళ్లిన సమయంలో ప్రజలు బీఎల్ఓలను గుర్తించేందుకు ఐడీ కార్డులు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పింది. అయితే, ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి పాల్గొన్న సమావేశంలో ఎన్నికల కమిషన్ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు వచ్చే బిహార్ ఎన్నికలకు ముందు అమలులోకి తీసుకువచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నది.