Bihar : కేంద్ర ఎన్నికల సంఘం ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ను బీహార్ స్టేట్ ఐకాన్గా నియమించింది. ఈ విషయాన్నిధ్రువీకరిస్తూ బీహార్ ప్రధాన ఎన్నికల అధికారికి లెటర్ కూడా పంపించింది. ఎన్నికల ప్రక్రియ గురించి 22 ఏళ్ల మైథిలీ ఓటర్లలో అవగాహన కల్పించనుంది. బీహార్ స్టేట్ ఐకాన్గా మైథిలీ ఠాకూర్ నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ‘స్టేట్ ఐకాన్గా నియామకం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మైథిలీ తెలిపింది. కూతురు రాష్ట్ర ఐకాన్గా ఎంపికవడం పట్ల మైథిలీ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.
‘ఎన్నికల సంఘం, బీహార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. స్టేట్ ఐకాన్గా నియమించడం వల్ల మైథిలీ బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా జానపద సంగీతాన్ని విస్తరింపచేస్తుంది. తద్వారా ఓటర్లను చైతన్యం చేస్తుంది’ అని మైథిలీ తండ్రి రమేశ్ ఠాకూర్ తెలిపాడు. 2025 అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మైథిలీని స్టేట్ ఐకాన్గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈమధ్యే మైథిలీ ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైంది. ఫోక్ మ్యూజిక్లో 2021కి గానూ ఆమెకు ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ యువ పురస్కారం అందజేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతంలో మైథిలీ శిక్షణ తీసుకుంది.