కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు.. బతుకుదెరువు కోసం ఏ పని చేసినా తప్పులేదు. భిక్షం అడుక్కోకుండా.. ఏదో ఒక పని చేస్తూ గౌరవంగా బతకాలని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అలా ఓ వృద్ధురాలు కూడా గౌరవంగా బతకాలనుకుంది. పండు ముసలి వయసులోనూ పెన్నులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది.
వృద్ధ మహిళ రతన్.. తాను పెన్నులు అమ్ముకునే డబ్బాపై ఇలా రాసి ఉంది.. నేను భిక్షం అడుక్కుంటలేను.. దయచేసి పెన్ను(రూ. 10) కొనండి. బ్లూ కలర్ పెన్స్, థ్యాంక్యూ. బ్లెస్ యూ అని రాసి ఉంది. పుణెలోని ఎంజీ రోడ్డులో పెన్నులు అమ్ముకుంటూ పలువురిని ఆకర్షిస్తోంది. పెన్నులు కొన్న తర్వాత చిరునవ్వుతో అందరి హృదయాలను దోచుకుంటోంది.
అయితే ఈ ముసలావిడ స్టోరీని శిఖా రాతి అనే ఓ యువతి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం రతన్ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది.
శిఖా రాతి తన ఫ్రెండ్తో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. రతన్ తన పెన్నుల డబ్బాతో కనిపించింది. ఆ డబ్బాపై రాసి ఉన్న ఆ వ్యాఖ్యలు చదివి.. ఆమెతో శిఖా ఫ్రెండ్ పెన్ను కొన్నది. దాంతో రతన్ కళ్లల్లో సంతోషం కనిపించింది. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. రతన్ మంచి మనసు, స్వీట్ స్మైల్ శిఖా ఫ్రెండ్ను బాగా ఆకర్షించాయి. మరిన్ని పెన్నులు కొనుగోలు చేసి రతన్ను సంతోషపరిచింది. బతుకు దెరువు కోసం రతన్ పడుతున్న కష్టాలను గుర్తించి.. ఆమె వద్ద పెన్నులను కొనుగోలు చేయాలని శిఖా పుణె వాసులను కోరింది.