లక్నో: రైల్లో ప్రయాణిస్తున్న వృద్ధుడిపై రైల్వే పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింగహి పోలీస్ స్టేషన్ పరిధిలోని చితియా గ్రామానికి చెందిన 60 ఏళ్ల మున్నా లాల్ తివారీ, గురువారం మైలాని-నాన్పురా రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆయన ఉన్న రైలు బోగిలో ముగ్గురు ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కానిస్టేబుల్స్ ఉన్నారు. అయితే ఒక విషయంపై ఆ వృద్ధుడు, రైల్వే పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన రైల్వే పోలీస్ అమిత్ సింగ్ తన వద్ద ఉన్న తుపాకీతో మున్నా లాల్ కాళ్లపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, ఈ సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రైలు టికునియా స్టేషన్కు చేరుకున్న తర్వాత కాల్పుల్లో గాయపడిన మున్నా లాల్ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొన్ని గంటలకే ఆయన చనిపోయాడు. ఈ నేపథ్యంలో వృద్ధుడి కుటుంబం ఫిర్యాదు మేరకు జీఆర్పీ కానిస్టేబుల్ అమిత్ సింగ్పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అయితే ఆ వృద్ధుడు తన వద్ద ఉన్న గన్ను లాక్కొనేందుకు ప్రయత్నించాడని, దీంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు రైల్వే కానిస్టేబుల్ అమిత్ సింగ్ ఆరోపించాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.