గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. అస్సాంలో గత వారం రోజుల నుంచి బస చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో రేపు జరిగే బలపరీక్షకు తాను హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సీఎం ఉద్దవ్ తన బలాన్ని రేపటి సాయంత్రంలోగా నిరూపించుకోవాలని గవర్నర్ కోశియారి ఆదేశించిన నేపథ్యంలో ఆ ఫ్లోర్ టెస్ట్కు హాజరుకానున్నట్లు షిండే తెలిపారు. అయితే వారం నుంచి హోటల్లోనే ఉన్న ఏక్నాథ్ షిండే బృందం ఇవాళ ఉదయం కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు. గౌహతిలో ఉన్న శక్తిపీఠం కామాఖ్య వద్ద ఇవాళ ఏక్నాథ్ పూజలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రజల తరపున కామాఖ్యకు పూజలు చేసినట్లు ఏక్నాథ్ తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు గౌహతిలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ముంబైకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.