ముంబై: శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు తమ గ్రూప్కు కొత్త పేరు పెట్టుకున్నారు. ‘శివసేన బాలాసాహెబ్’ బృందంగా పేర్కొన్నారు. ‘మేం ‘శివసేన బాలాసాహెబ్’ బృందం. ఏ పార్టీలోనూ విలీనం కాబోం’ అని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ తెలిపారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శనివారం ఆ పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో రెబల్ ఎమ్మెల్యేలపై కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఏక్నాథ్ షిండే బృందం ఈ మేరకు ప్రకటించింది.
కాగా, 38 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్సాం రాజధాని గౌహతిలోని హోటల్లో క్యాంప్ చేస్తున్నారు. అయినప్పటికీ మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం తన కూటమిని ధైర్యంగా కొనసాగిస్తున్నది. మరోవైపు ఏక్నాథ్ షిండే అసెంబ్లీ నాయకుడిగా ఎన్నికవుతారంటూ శివసేన రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం తాత్కాలిక స్పీకర్ నరహరి జిర్వాల్కు లేఖ రాశారు. అలాగే 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న శివసేన ప్రతిపాదనను ఆమోదించిన జిర్వాల్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇద్దరు స్వతంత్ర శాసన సభ్యుల మద్దతుతో నోటీసు కూడా ఇచ్చారు.