ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన అని ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు. శివసేన నాయకుడిగా ఏక్నాథ్ షిండే నియమితులయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనను
తొలగించే అధికారం ఉద్ధవ్ ఠాక్రేకు లేదని అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన రెండు వర్గాలు (Sena vs Sena) దాఖలు చేసిన అభ్యర్థనలపై స్పీకర్ ఎట్టకేలకు బుధవారం తీర్పు ఇచ్చారు. ఏక్నాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన అని పేర్కొన్నారు. 2018 నాటి నాయకత్వ నిర్మాణం శివసేన రాజ్యాంగానికి అనుగుణంగా లేదని తెలిపారు. ‘2018 నాయకత్వ నిర్మాణం శివసేన పక్షప్రముఖ్ను అత్యున్నత పదవిగా పేర్కొంది. అయితే, 1999 నుంచి అనుసరిస్తున్న శివసేన రాజ్యాంగంలో అత్యున్నత పదవి శివసేన ప్రముఖ్ (చీఫ్), రాష్ట్రీయ కార్యకారిణి (శాసనసభ) అత్యున్నత అధికారిగా పేర్కొన్నారు’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్ ఠాక్రేకు లేదన్నారు.
కాగా, 2018 నుంచి 2013 వరకు శివసేనలో సంస్థాగత ఎన్నికలు జరుగలేదని స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు. అయితే రెండు వర్గాలు సుప్రీంకోర్టుకు భిన్నంగా రాజ్యాంగాన్ని సమర్పించాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద ఉన్న రికార్డులకే తాను పరిమితమైనట్లు తెలిపారు. శివసేన రాజ్యాంగానికి సంబంధించి ఈసీ నుంచి అందిన పత్రాల ఆధారంగా ఏక్నాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన అని పేర్కొన్నారు. ఆ వర్గం ఎమ్మెల్యేల అనర్హత కోసం దాఖలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థనను స్పీకర్ తోసిపుచ్చారు.