ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరుకుంది. ఉద్థవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 38 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బయటకు రావడంతో ఎంవీఏ ప్రభుత్వం మైనార్టీలో పడిందని షిండే వర్గం సోమవారం పేర్కొంది. డిప్యూటీ స్పీకర్ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆరోపించింది.
మరోవైపు రాజ్ ఠాక్రేతో అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తదుపరి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని అసమ్మతి వర్గం నిర్ణయించింది. ఇక రెబెల్ గ్రూపుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు.
అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని స్పష్టం చేసిన రౌత్ హిందుత్వ కోసం ఎవరు ప్రాణాలు అర్పించారో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్ధిరత నేపధ్యంలో ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె డిమాండ్ చేశారు.