ఇంపాల్: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) అధ్యక్షుడితో పాటు మరో ముగ్గురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు. మణిపూర్(Manipur)లో అల్లర్లను రెచ్చగొట్టేందుకు వాళ్లు ప్రయత్నించినట్లు ఆయన ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు.ఒకవైపు మణిపూర్లో మారణహోమం జరుగుతుంటే, ఎడిటర్స్ గిల్డ్ మాత్రం విరుద్ధమైన కథనాల్ని ప్రచురించినట్లు ఆయన ఆరోపించారు. మణిపూర్ చరిత్రను, అక్కడ నేపథ్యాన్ని అర్ధం చేసుకోకుండా తప్పుడు కథనాలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈజీఐ ప్రెసిడెంట్ సీమా ముస్తాఫాతో పాటు సీనియర్ జర్నలిస్టులు సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్ కపూర్లను బుక్ చేశారు. ఆగస్టు 7 నుంచి 10 మధ్య వాళ్లు మణిపూర్లో పర్యటించారని, రాష్ట్రానికి, దేశానికి, వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్లు రిపోర్టును తయారు చేసినట్లు బీరేన్ సింగ్ ఆరోపించారు. కుకీ, మైతీల ఘర్షణల గురించి స్థానిక మీడియా రాజకీయ కోణంలో కథనాలను రాసినట్లు ఈజీఐ తన రిపోర్టులో తెలిపింది.