Edible Oil | కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వంటనూనె ధరలు మాత్రం తగ్గడం లేదు. మూడు ప్రధాన ఎడిబుల్ ఆయిల్ అసోసియేసన్లకు కేంద్రం ఇటీవల లేఖలు రాసింది. ఇందులో వెంటనే ధరలను తగ్గించడంతో పాటు ఈ విషయాన్ని ఆహార, ప్రజాపంపిణీ శాఖకు ఎప్పటికప్పుడు తెలుపాలని సూచించింది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్లకు రాసిన లేఖలో ప్రపంచవ్యాప్తంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది.
ఈ పరిస్థితిలో ఆయా అసోసియేషన్లు తమ సభ్యులతో మాట్లాడి లీటర్కు కనీసం రూ.15 వరకు తగ్గించాలని కోరింది. వారంలో ధరలు తగ్గించాలంటూ ఈ నెల 6న కంపెనీలను ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఐదు రోజులుగడుస్తున్నా పలు కంపెనీలు మాత్రం ఇంకా ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గించలేదు. ఈ కంపెనీల్లో అదానీ విల్మార్, రుచి సోయా, కార్గిల్ అండ్ అలనా ఉన్నాయి. ఇప్పటి వరకు లిబర్టీ, పార్క్ ఆగ్రో, మదర్ డెయిరీ మాత్రమే ధరలను తగ్గించాయి. ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై అధికంగా ఆధారపడడం దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందని రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ కేర్ ఎడ్జ్ ఓ నివేదికలో పేర్కొంది.
భారత్ ఇప్పుడు ఆర్థిక వివేకంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రధాన ఎడిబుల్ ఆయిల్ ఎగుమతి దేశాలు పామాయిల్ ఎగుమతిని నిషేధించాయని ఓ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితిలో దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని సూచించింది. అయితే, దేశంలో నూనెగింజల ఉత్పత్తి పెరుగుతున్నా.. వినియోగించినంత మేరకు ఉత్పత్తి కావడం లేదని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.