కోల్కతా: పశ్చిమబెంగాల్లోని సందేశ్కాళీలో ఈడీ (ED) బృందంపై స్థానికులు దాడికిపాల్పడ్డారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కుంభకోణం (Ration Distribution Scam) ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత షాజహాన్ షేక్ (Shah Jahan Sheikh) నివాసంపై ఈడీ అధికారులు దాడిచేశారు. సోదాల అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడినుంచి తీసుకెళ్తుండగా.. సుమారు 200 మందికిపైగా స్థానికులు వారి కార్లను చుట్టుముట్టారు. వాటిని ధ్వంసం చేశారు.
కాగా, పశ్చిమబెంగాల్లో 30 శాతానికిపైగా రేషన్ బియ్యం (PDS) పక్కదారిపడుతున్న ఆరోపణలు ఉన్నాయి. రైతుల పేరుతో నఖిలీ ఖాతాలు తెరిచిన పలువురు రైస్ మిల్లర్లు, కోఆపరేటివ్ సొసైటీలు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను రైతులకు ఇవ్వకుండా వారే తీసుకుంటున్నారని ఈడీ పేర్కొన్నది. ఇదే వ్యవహారంలో గతేడాది అక్టోబర్ 14న రైస్ మిల్లు యజమాని బక్బీర్ రహ్మాన్ను అరెస్టు చేసింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా రూ.1.42 కోట్లు స్వాధీనం చేసుకున్నది. తాజాగా ఇదే కేసులో అధికారపార్టీ నేత ఇంటిపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.