ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. పత్రా చావల్ ల్యాండ్ స్కాం కేసులో ఈడీ సంజయ్ రౌత్కు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సంజయ్ రౌత్కు చెందిన ఆస్తులు కొన్నింటినీ ఈడీ అటాచ్ చేసింది. రౌత్కు సమన్లు జారీ చేయడం ద్వారా ఈడీ కాషాయ పార్టీ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించిందని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. మరోవైపు రేపు విచారణకు హాజరు కావాలని సంజయ్ రౌత్కు ఈడీ సమన్లు జారీ చేయడంపై టీఎంసీ మోదీ సర్కార్పై విరుచుకుపడింది.
ప్రత్యర్ధులను వేధించడం, విపక్ష సర్కార్లను కూల్చివేయడం వంటి వికృత చర్యలకు పాల్పడుతున్న నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీఎంసీ ప్రతినిధి సాకేత్ గోఖలే విస్మయం వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరుకుంది. ఉద్థవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 38 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బయటకు రావడంతో ఎంవీఏ ప్రభుత్వం మైనార్టీలో పడిందని షిండే వర్గం సోమవారం పేర్కొంది. డిప్యూటీ స్పీకర్ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆరోపించింది.
మరోవైపు రాజ్ ఠాక్రేతో అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తదుపరి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని అసమ్మతి వర్గం నిర్ణయించింది. ఇక రెబెల్ గ్రూపుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని స్పష్టం చేసిన రౌత్ హిందుత్వ కోసం ఎవరు ప్రాణాలు అర్పించారో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్ధిరత నేపధ్యంలో ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె డిమాండ్ చేశారు.