కోల్కతా : టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్కు (Teachers Recruitment Scam) సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిర బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అభిషేక్ను అక్టోబర్ 9న ఆయన భార్యను అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలని సమన్లలో దర్యాప్తు సంస్ధ పేర్కొంది.
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో రుజిరకు ఈడీ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్లో ప్రైమరీ టీచర్ల పోస్టులను అక్రమంగా భర్తీ చేసేందుకు అభ్యర్ధుల నుంచి డబ్బు వసూలు చేశారని ఈ కేసులో నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ స్కామ్లో సేకరించిన సొమ్మును అభిషేక్ బెనర్జీ తండ్రి అమిత్ బెనర్జీ, అభిషేక్ భార్య రుజిరలు డైరెక్టర్లుగా ఉన్న లీప్స్ అండ్ బౌండ్ ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది.
ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం అక్రమ నియామకాలను చేపట్టినందుకు సుజయ్ కృష్ణ భద్రకు అత్యంత సన్నిహితుడైన కుంతల్ ఘోష్ తన నుంచి డబ్బు తీసుకున్నాడని తపస్ కుమార్ మొండల్ వెల్లడించాడు. కాగా సుజయ్ కృష్ణ భద్ర అభిషేక్ బెనర్జీ ఆర్ధిక వ్యవహారాలను చూసే వ్యక్తని, ఆయన బెనర్జీకి అత్యంత సన్నిహితుడని ఈడీ పేర్కొంది.