న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై సీబీఐ, ఈడీ దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఢిల్లీ జల్ బోర్డులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్, ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది.
ఢిల్లీ జల్ బోర్డులో ఓ టెండర్కు సంబంధించి అవినీతి చోటుచేసుకున్నదని, ఈ అవినీతి సొమ్ము ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల ఫండ్గా వెళ్లిందన్నది ప్రధాన ఆరోపణ. అర్హతలేని కంపెనీకి టెండర్ను అప్పగించడానికి డబ్బులు చేతులు మారాయని, ఇలా అవినీతి వల్ల వచ్చిన డబ్బుల్లో దాదాపు రూ.17 కోట్లు ఆప్కు అందాయని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు తాజాగా ఢిల్లీలో 12 చోట్ల సోదాలు చేపట్టారు. దీనిపై ఢిల్లీ మంత్రి అతిశీ స్పందిస్తూ ఆప్ను భయపెట్టడానికే సోదాలు చేపట్టారని విమర్శించారు.