ED Raids | కోల్కతా, మార్చి 22: లోక్సభ ఎన్నికల ముందర విపక్ష పార్టీలకు చెందిన నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసిన ఈడీ.. శుక్రవారం టీచర్ రిక్రూట్మెంట్ కేసులో బెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హా ఇంటిపై దాడులు నిర్వహించింది. బీర్బూమ్ జిల్లా బోల్పోరులోని మంత్రి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు ప్రారంభించారు. అయితే సోదాల సమయంలో మంత్రి పూర్వీకుల గ్రామంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని, ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.
అలాగే రిక్రూట్మెంట్ కుంభకోణంలో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఈడీ ఏకకాలంలో కోల్కతా, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కొంతమంది వ్యాపారుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించింది. కాగా, ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ శాఖలకు మంత్రిగా ఉన్న చంద్రనాథ్ను అంతకుముందు పశువులు, బొగ్గు స్మగ్గింగ్ కేసుల్లో సీబీఐ సమన్లు జారీ చేసింది.
మరోవైపు మంత్రి సోదరుడు, టీఎంసీ నేత స్వరూప్ బిశ్వాస్ నివాసంలో వరుసగా మూడో రోజు శుక్రవారం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు సోదాలు కొనసాగించారు. రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఐటీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ మంత్రి అరూప్ బిశ్వాస్ సోదరుడైన స్వరూప్ బిశ్వాస్ ఖాతాకు డబ్బు బదిలీ చేశాయని ఐటీ అధికారి ఒకరు ఆరోపించారు.