YS Reddy | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ముంబైలోని ఓ టౌన్ ప్లానింగ్ అధికారి యాదగిరి శివకుమార్రెడ్డి అవినీతి గుట్టురట్టయింది. ఈడీ దాడుల్లో సదరు అధికారి అక్రమ సంపాదన వెలుగుచూసింది. అతడికి సంబంధించిన 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అరచేతి మందం కలిగిన భారీ బంగారు బిస్కెట్లు చూసి ఈడీ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని వసాయివిరార్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న యాదగిరి శివకుమార్రెడ్డికి చెందిన ముంబై, హైదరాబాద్లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో రూ. 9.04 కోట్ల నగదు, రూ. 23.25 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు సహా రూ.32.29 కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
వీవీఎంసీలో 2009 నుంచి అక్రమ నిర్మాణాల కుంభకోణం జరుగుతున్నది. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి 41 అక్రమ నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో పెద్దఎత్తున అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో 41 అక్రమ కట్టడాలను కూల్చివేయాలని 2024 జూలై 8న బాంబే హైకోర్టు ఆదేశించింది. ఆయా భవనాల యజమానులు సుప్రీంకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేసినా ఊరట దక్కలేదు. దీంతో గత ఫిబ్రవరి 20న అక్రమ కట్టడాలను వీవీఎంసీ కూల్చివేసింది. భవనాల కూల్చివేత తర్వాత వాటి యజమానులు తమకు భూములు, భవనాలు అమ్మిన బ్రోకర్లు, బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. ఇదొక పెద్ద కుంభకోణమని గుర్తించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అక్రమ నిర్మాణాల వెనుక స్థిరాస్తి వ్యాపారులు సీతారామ్గుప్తా, అరుణ్గుప్తా, టౌన్ప్లానింగ్ అధికారి శివకుమార్రెడ్డి పాత్రను గుర్తించారు. వీరిలో శివకుమార్రెడ్డి ప్రధాన సూత్రధారి అని గుర్తించిన ఈడీ అధికారులు బుధ, గురువారాల్లో ముంబై, హైదరాబాద్లో ఏకకాలంలో సోదాలు చేశారు.