(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : మరికొద్ది రోజుల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయాల్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా తదితర నగరాల్లోని ఐప్యాక్ ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ నివాసంలోనూ ఈ తనిఖీలు జరిగినట్టు సమాచారం. బొగ్గు స్మగ్లింగ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ సోదాలు నిర్వహించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు ఎన్నికల వ్యూహరచన చేస్తున్న ఐప్యాక్ కార్యాలయాలపై జనవరిలోనూ ఈడీ దాడులు నిర్వహించింది. సెంట్రల్ కోల్కతాలోని లౌడన్ స్ట్రీట్లో ఉన్న ఐప్యాక్ అధిపతి ప్రతీక్ జైన్ నివాసం, కార్యాలయంతోపాటు సాల్ట్ లేక్లోని ఐప్యాక్ మరో కార్యాలయంలోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. అయితే, ఈ సోదాలు కొనసాగుతున్న సమయంలో అక్కడకు చేరుకొన్న సీఎం మమతా బెనర్జీ జైన్ నివాసం లోపలికి చొచ్చుకొని వెళ్లారు. అనంతరం కొంత సమయం తర్వాత ఆకుపచ్చ రంగు ఫైలు పట్టుకుని బయటకు వచ్చారు. అనంతరం అక్కడే ఉన్న మీడియాతో మమత మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ దాడులు రాజకీయ ప్రోద్బలంతో జరిగినవని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ దాడుల వెనుక ఉన్నారని, టీఎంసీ ఎన్నికల వ్యూహాన్ని, 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలను, పార్టీకి చెందిన రహస్య పత్రాలను కాజేసేందుకే ఈ దాడులకు ఆదేశించారని మమత ఆరోపించారు. టీఎంసీ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన ఫైళ్లను చోరీ చేశారని ఈడీని నిందించారు.