బెంగుళూరు: కర్నాటక పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సతీశ్ జార్కిహోలీ(Satish Jarkiholi) నివాసాల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నది. మంత్రి సతీశ్ కుమార్తె, ఎంపీ ప్రియాంకా జార్కిహోలీ నివాసాల్లోనూ ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రాపర్టీలకు చెందిన కేసులో ఈ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 18 ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నాయి. బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న మంత్రి సతీశ్ ఇంటితో పాటు అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
చిక్కోడి లోక్సభ ఎంపీ ప్రియాంకాకు చెందిన బెల్తావి జిల్లాలోని ఇంటిని కూడా ఈడీ తనిఖీ చేస్తున్నది. మంత్రి, ఆయన కుమార్తె ఎంపీపై కొత్త కేసులో ఈ దర్యాప్తు సాగుతున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. జార్కిహోలీ బావమరిది, ఎక్సైజ్ శాఖ ఆఫీసర్ వైడీ మంజునాథ్ కేసుతో లింకు లేదని ఈడీ చెబుతోంది. అయితే కేసు పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది. బెంగుళూరు, బెల్గావి, గోకర్ణతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. జార్కిహోలీ ఫ్యామిలీ బిజినెస్తో పాటు కుటుంబసభ్యులు, సన్నిహితుల ఇండ్లల్లో తనిఖీలు చేపట్టారు.