Youtuber Nandu | విదేశాల్లో ఉద్యోగాలు, లండన్ వీసాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేమస్ యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను పోలీసులు విచారించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట మంగళవారం ఆమె తన తల్లి, న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు ఆమెను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో నందన కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా నడుస్తున్న ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కన్సల్టెన్సీకి సంబంధించిన వ్యవహారాలను తన భర్త మధుకర్, అకౌంటెంట్ చూసుకుంటారని.. తాను అందులో జోక్యం చేసుకోనని నందన చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే కన్సల్టెన్సీలో ఆమె పాత్ర ఏమిటి? సంస్థ యజమాని, డైరెక్టర్లు ఎవరు? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? వంటి అంశాలపై పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు ఆమె నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని పోలీసులు భావించిన నేపథ్యంలో.. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నందన, ఆమె భర్త మధుకర్ సోషల్ మీడియాలో ‘నందూస్ వరల్డ్ కపుల్’ పేరుతో యూట్యూబ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రేజ్తో నందనకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో ఆమె నటించారు.
అయితే విదేశాల్లో ఉద్యోగాలు, లండన్ వీసాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఈ దంపతులపై వచ్చాయి. ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి కుమార్ తన నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైనట్లు సమాచారం. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కొందరు బాధితులు కూడా తమ నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు నేపథ్యంలో నందనపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఆమె విదేశాల్లో ఉండగా.. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఆ తర్వాత న్యాయవాదితో కలిసి విచారణకు హాజరవుతున్నారు.