న్యూఢిల్లీ: పీయూష్ జైన్.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ పర్ఫ్యూమ్ వ్యాపారి పేరు కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతున్నది. ఇందుకు కారణం.. పన్ను ఎగవేత ఆరోపణలపై అధికారులు కాన్పూర్లోని ఆయన ఇంటిపై సోదాలు చేయగా, గుట్టలకొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆయన అక్రమ వ్యవహారాన్ని పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు పట్టించాయి. జీఎస్టీ చెల్లించకుండా వీటిని రవాణా చేస్తున్న గణపతి రోడ్ క్యారియర్ ట్రక్కులను పట్టుకున్నారు. శిఖర్ పాన్ మసాలా ఫ్యాక్టరీలో సోదాలు జరుపగా.. అక్కడ 200లకు పైగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. శిఖర్ పాన్ మసాలాలో పీయూష్ జైన్కి చెందిన ఒడోకామ్ ఇండస్ట్రీకి కూడా వాటాలు ఉన్నాయి. దీంతో అధికారుల కన్ను పీయూష్ వైపు మళ్లింది. ఈ రెండు కంపెనీలు తమ ఉత్పత్తులను పన్నులు చెల్లించకుండా అక్రమంగా రవాణా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. కాన్పూర్లోని ఆయన ఇంటిపై సోదాలు చేయగా, భారీ నగదు పట్టుబడింది. రూ.257 కోట్లలో రూ.177.45 కోట్లు లెక్కలు లేని సొమ్ముగా గుర్తించి సీజ్ చేశారు. దీంతో పాటు 23 కేజీల బంగారం, 600 కేజీల గంధపు చెక్కల నూనెను కూడా స్వాధీనం చేసుకొన్నారు.
వాళ్లకు పుష్పరాజ్ జైన్కు.. పీయూష్ జైన్కు తేడా తెలువదు: అఖిలేశ్
కేంద్రంలోని, ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాలు పప్పులో కాలేశాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఇటీవల కాన్పూర్కు చెందిన అత్తర్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగాయి. అయితే డిజిటల్ తప్పిదం వల్ల బీజేపీ నాయకులు వాళ్లకు చెందిన వ్యాపారి(పీయూష్ జైన్) ఇంటిపైనే సోదాలు చేయించారు. సమాజ్వాదీ అత్తర్ను తయారు చేసింది మా పార్టీ నేత పుష్పరాజ్ జైన్. కానీ వాళ్లకు పుష్పరాజ్ జైన్కు.. పీయూష్ జైన్కు తేడా కనిపించలేదు’ అని ఎద్దేవా చేశారు.